Minister Seethakka : హైదరాబాద్ – మావోయిస్టులు మంత్రి సీతక్కను ఉద్దేశించి హెచ్చరిస్తూ రాసిన లేఖ కలకలం రేపింది. దీనిపై శుక్రవారం మంత్రి దాసరి సీతక్క స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదన్నారు. అయితే లేఖలో లేని అంశాలపై ఒక రాజకీయ పార్టీ పత్రికలు, మీడియా సంస్థలు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని ఆరోపించారు.
Minister Seethakka Respond
మహిళ అని చూడకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ తమ రాజకీయ కక్షను తీర్చుకుంటున్నాయని వాపోయారు. అసభ్య పదజాలాన్ని వినియోగించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఒక మహిళను పట్టుకుని సిగ్గులేదా అని రాయడం ఏం జర్నలిజం అని ప్రశ్నించారు. తాను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేనని అన్నారు. వారంలో రెండు మూడు రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు.
తనను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయని ఆరోపించారు సీతక్క (Minister Seethakka). అవే శక్తులు ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక కోయ మహిళలకు జనరల్ పోర్ట్ ఫోలియో దక్కడాన్ని బీఆర్ఎస్ జీర్ణించు కోలేకపోతోందని ధ్వజమెత్తారు. తన వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. జీవో 49 తో అటవి బిడ్డలు నష్టపోతారని ఆ జీవోను వ్యతిరేకించానని చెప్పారు.
గిరిజన సంక్షేమ మంత్రి కాకున్నా..పార్టీలకు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమై జీవో 49 ను రద్దు చేయాలని తీర్మాణించడం జరిగిందన్నారు. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసి అడవి బిడ్డనేని స్పష్టం చేశారు. వారి సంక్షేమం, అభివృద్ది కోసమే నా జీవితం అంకితం అన్నారు. ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశానని గుర్తు చేశారు.
Also Read : రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
