KTR : హైదరాబాద్ – కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). కాంగ్రెస్ సర్కార్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు గురించి కేంద్ర మంత్రి అమిత్షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారి పోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోం మంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా అని ప్రశ్నించారు.
KTR Shocking Comments on CM Revanth Reddy
దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించగలరా అని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్టుగా సాగుతున్న కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్ను (CM Revanth Reddy) వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా అని అన్నారు.
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో దేశ ప్రధాని మోదీ వచ్చినప్పుడు, ఏకంగా రాహుల్-రేవంత్ కలిసి ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు కానీ దర్యాప్తునకు మాత్రం నేటికీ ఆదేశించ లేదన్నారు. తెలంగాణకు వచ్చి కేవలం సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అన్నారు.
పట్టపగలు ప్రజాధనం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్ సీఎం అక్రమాలకు కేంద్ర అడ్డుకట్ట వేయ లేక పోవడం బాధాకరమన్నారు. మరోవైపు.. ధాన్యం దిగుబడిలో పంజాబ్నే తలదన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం అత్యంత దురదృష్టకరమని వాపోయారు.
ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూరు చేయకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని నాలుగు కోట్ల ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
Also Read : MLC Basavaraju Sariah Sensational Comments : కొండా మురళి పిచ్చి మాటలు మానుకోవాలి















