High Court : హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిపడింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నించింది. సెటిల్మెంట్లు తారా స్థాయికి చేరుతున్నాయని, వెంటనే పోలీసులకు కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ వో పీ) రూపొందించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. రాచకొండ కమిషనర్, నాగోల్ పీఎస్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
TG High Court Shocking Comments
నాగోల్ సర్కిల్ బండ్లగూడకు చెందిన వ్యక్తిని, ఒక భూ వివాదాన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో రూ.55 లక్షలకు సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ జూన్ 19వ తేదీన పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు పోలీసులు. దీంతో బాధితుడు హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేశాడు. తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారంటూ వాపోయాడు. తనకు రక్షణ కల్పించాలని, తన భూమి సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరాడు.
ఈ దావాపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అతనిపై దౌర్జన్యం చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది. పోలీసులు సివిల్ కేసులను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారని, కేసు కోర్టులో ఉన్న తరువాత పోలీసుల జోక్యం ఎందుకని అధికారులను నిలదీసింది హైకోర్టు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుందో , ఎవరెవరు ఇలాంటి సెటిల్మెంట్లకు తెర తీశారో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది డీజీపీని.
Also Read : AV Ranganath Interesting Comments : రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ టీమ్ లు – హైడ్రా















