Sridhar Deshpande : హైదరాబాద్ – ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణుడు , మాజీ సీఎం సలహాదారు శ్రీధర్ దేశ్ పాండే (Sridhar Deshpande) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని పేర్కొన్నారు. ఏనాడూ మాజీ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో ఏపీకి గోదావరి జలాలను ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పూర్తిగా సత్య దూరమన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. తెలంగాణ ప్రాంతంలో నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో సీఎం తెలుసుకుంటే మంచిదన్నారు. ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడితే జనం నవ్వుకుంటారని పేర్కొన్నారు.
Sridhar Deshpande Shocking Comments
2016లో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు . గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్కు గోదావరి జలాలను ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. కేంద్ర మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదన్నారు. అయితే ప్రతి సంవత్సరం గోదావరి జలాలు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారని స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు.
ప్రధానంగా నీటి వనరుల గురించి కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందన్నారు శ్రీధర్ దేశ్ పాండే. గోదావరి ప్రవాహాలు, ఉప నదులపై మంచి పట్టుందని కొనియాడారు. నీటి కొరత ఉన్న ప్రాంతానికి ఇలా నీళ్లు వృధాగా వెళ్లడం వల్ల ఆయా రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తానే స్వయంగా ప్రస్తావించారని గుర్తు చేశారు . అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని చెప్పారు. గోదావరి నది సామర్థ్యం కృష్ణా నది పరిస్థితితో పోలిస్తే ఎలా అని శ్రీధర్ దేశ్ పాండే ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
Also Read : Supreme Court Warning :గచ్చిబౌలిలో పచ్చదనం కోసం ప్రయత్నం
